జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం : సీఎం రేవంత్‌ రెడ్డి

by Disha Web Desk 1 |
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం : సీఎం రేవంత్‌ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో పని చేసే జర్నలిస్టులందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం రాష్ట్ర సచివాలయంలో సీఎంను కలిసి వినతి‌పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయాన్ని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనూ చర్చించాలని డీజేహెచ్‌ఎస్‌ ప్రతినిధులకు సూచించారు. అనంతరం తాము జర్నలిస్టులకు ఎలా ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

డీజేహెచ్‌ఎస్‌ అధ్యక్షులు బొల్లోజు రవి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల కాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశం ఒక కలగానే మిగిలిందని అన్నారు. సీఎంకు ఇచ్చిన వినతిపత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాల అంశాన్ని చేర్చాలని ఎన్నికల సమయంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కలిసి విన్నవించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. డీజేహెచ్‌ఎస్‌ విన్నపాన్ని మన్నించి మేనిఫెస్టోలో అంశాన్ని పొందుపరిచారని, అందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత కేవలం తెలంగాణ ప్రాంత జర్నలిస్టులతో ఏర్పాటైన ఏకైక సొసైటీ డీజీహెచ్‌ఎస్‌ అని సీఎంకు తెలిపారు. ఈ సొసైటీలో ఐదు వందల మందికిపైగా సభ్యులు సభ్యులు ఉన్నారని తెలిపారు. వారంతా వివిధ పత్రికలు, న్యూస్‌ ఛానెళ్లలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్టాఫ్‌ రిపోర్టర్, సబ్‌ ఎడిటర్‌ నుంచి బ్యూరో చీఫ్‌లు, న్యూస్‌ ఎడిటర్, అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఆపై స్థాయిలో హైదరాబాద్‌ కేంద్రంగా దశాబ్దాలుగా పని చేస్తున్నారని సీఎంకు ఇచ్చిన వినతిపత్రంలో వివరించారు. ఈ మేరకు సొసైటీ కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండా రామకృష్ణ, స్వామిరెడ్డి, సభ్యులు క్రాంతి తదితరులు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

Next Story

Most Viewed